చిన్న సినిమాలను ప్రేక్షకులతో పాటు మీడియా కూడా మరింతగా ప్రోత్సహించాలని ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి పిలుపునిచ్చారు. భారీ బడ్జెట్ చిత్రాల హవా మధ్య చిన్న సినిమాల్లోనే అసలైన ప్రతిభ, కొత్త ఆలోచనలు, బలమైన కథలు దాగి ఉంటాయని ఆమె స్పష్టం చేశారు. అలాంటి చిత్రాలకు తగిన గుర్తింపు దక్కితే తెలుగు సినీ పరిశ్రమ మరింత బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు. ‘కర్మాఖ్య’ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న విజయశాంతి మాట్లాడుతూ.. పెద్ద సినిమాలతో పోలిస్తే చిన్న చిత్రాలకు ప్రచారం, ప్రోత్సాహం చాలా తక్కువగా లభిస్తోందన్నారు. అయితే కంటెంట్ బలంగా ఉంటే చిన్న సినిమాలే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటాయని పేర్కొన్నారు. కొత్త దర్శకులు, యువ నటీనటులు పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే ప్రేక్షకుల ఆదరణతో పాటు మీడియా సహకారం కూడా అత్యంత కీలకమని ఆమె చెప్పారు.
కొత్త కథలు, వినూత్నమైన ఆలోచనలతో తెరకెక్కే సినిమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీడియా బాధ్యత ఎంతో ఉందని విజయశాంతి వివరించారు. ప్రారంభ దశలో సరైన ప్రచారం లభిస్తే చిన్న సినిమాలు కూడా భారీ విజయాలు సాధించగలవని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. ‘కర్మాఖ్య’ చిత్రంలో నటి అభినయ చూపించిన అంకితభావాన్ని ప్రత్యేకంగా ప్రశంసించిన విజయశాంతి, సినిమా కోసం ఆమె చేసిన త్యాగాలకు ప్రేక్షకులు తప్పకుండా ఆదరణ చూపిస్తారని అన్నారు. ప్రతిభను గౌరవించే తెలుగు ప్రేక్షకుల వల్లే పరిశ్రమ దేశవ్యాప్తంగా విస్తరిస్తోందని పేర్కొన్నారు. ఏ ప్రాంతానికి చెందిన హీరోయిన్ అయినా ప్రతిభ ఉంటే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని ఆమె చెప్పారు. ప్రస్తుతం రాజకీయాల్లో పూర్తి స్థాయిలో బిజీగా ఉన్నానని, అందువల్ల సినిమాలపై దృష్టి పెట్టలేకపోతున్నానని విజయశాంతి వెల్లడించారు. అయితే బలమైన కథ, నటిగా సవాల్ విసిరే పాత్ర వస్తే మాత్రం తప్పకుండా పరిశీలిస్తానని స్పష్టం చేశారు. అదిరే అభి (అభినయ కృష్ణ) దర్శకత్వంలో తెరకెక్కిన ‘కర్మాఖ్య’ చిత్రం జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.